Sai Gurukulam Episode 1307 //సచ్చరిత 15వ అధ్యాయంలో చోల్కర్ లీల జరిగిన థానే కౌపినేశ్వర అలయం.
పూనా అహమ్మదునగరు జిల్లాలో బాబాను గూర్చి యందరికి తెలియును. గాని నానాసాహెబు చాందోర్కరు ఉపన్యాసముల వల్లను, దాసుగణు హరికథలవల్లను, బాబా పేరు కొంకణదేశమంతయు ప్రాకెను. నిజముగా దాసుగణు తన చక్కని హరికథలవల్ల బాబాను అనేకులకు పరిచయ మొనర్చెను. హరికథలు వినుటకు వచ్చినవారికి అనేకరుచు లుండును. కొందరు హరిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు; కొందరికి వారి నటన; కొందరికి వారి పాటలు; కొందరికి హాస్యము, చమత్కారము; సంతసము గలుగజేయును. కథాపూర్వమున దాసుగణు సంభాషించు వేదాంతవిషయములు వినుటకు కొందరు; అసలు కథలు వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చినవారిలో చాల కొద్దిమందికి మాత్రమే భగవంతునియందుగాని, యోగులయందుగాని, ప్రేమ-విశ్వాసములు కలుగును. కాని దాసుగణుయొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావ మతిసమ్మోహనకరముగా నుండెను. ఇచ్చట నొక యుదాహరణము నిచ్చెదము.
ఠాణాలోనున్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసుగణు మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకువచ్చిన వారిలో చోల్కర్ యనునతడుండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. దాసుగణు కీర్తన నతిజాగ్రత్తగా వినెను. వాని మనస్సు కరగెను. వెంటనే అక్కడనే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. "బాబా! నేను పేదవాడను, నాకుటుంబమునే నేను పోషించుకొన లేకున్నాను. మీ యనుగ్రహముచేత సర్కారు వారి పరీక్షలో నుత్తీర్ణుడనై ఖాయమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీ వచ్చెదను. మీ పాదములకు సాష్టాంగనమస్కారము చేసెదను. మీ పేరున కలకండ పంచిపెట్టుదును." వాని యదృష్టముచే చోల్కరు పరీక్షలో పాసయ్యెను. ఖాయమైన యుద్యోగము దొరికెను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో నంత బాగుండు ననుకొనెను. చోల్కరు బీదవాడు. వాని కుటుంబము చాల పెద్దది. కనుక షిరిడీయాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. అందరికి తెలిసిన లోకోక్తి ప్రకార మెవరైన పర్వతశిఖరమునై న దాట వచ్చునుగాని బీదవాడు తన యింటి గడపనే దాటలేడు. చోల్కరున కెటులైన శ్రీ సాయి మ్రొక్కును త్వరలో చెల్లించ వలెనని యాతురుత గలిగెను. కావున తన సంసారమునకగు ఖర్చులను తగ్గించి కొంతపైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని యా మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఇవ్విధముగా కొంత ద్రవ్యము మిగిల్చిన పిమ్మట, షిరిడీ వచ్చి బాబా పాదములపై బడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మ్రొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. బాబాతో తాను సంతసించినట్లు తన కోరికలన్నియు నానాడు నెరవేరెననియు చెప్పెను. చోల్కరు బాపుసాహెబు జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును బిలచి యిట్లనెను. "నీ యతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి యిమ్ము." ఈ పలుకులలోని భావమును గ్రహించినవాడై, చోల్కరు మనస్సు కరగెను. అతడాశ్చర్యమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై బడెను. జోగు కూడ ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర యెక్కువగా కలుపుట యనుదాని భావము ఏమైయుండునా యని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి, నమ్మకములను కలుగ జేయ వలెనని యుద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియు, తేయాకునీళ్ళలో చక్కెర నుపయోగించక పోవుట యను రహస్యమనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియు చెప్పెను. బాబా యిట్లు చెప్పనుద్దేశించెను. "నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. శరీరముతో నేనిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీ కిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాసస్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజనహృదయములందుగల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు; పావనులు; అదృష్టవంతులు."
బాబా చోల్కరు కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో గదా!
Негізгі бет Sai Gurukulam Episode 1307 //సచ్చరిత 15వ అధ్యాయంలో చోల్కర్ లీల జరిగిన థానే కౌపినేశ్వర అలయం.
No video
Пікірлер: 41